హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్: రాష్ట్రంలోని మహిళలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. మహిళా జర్నలిస్టులకు ప్రత్యేకంగా ప్రారంభించిన మాస్టర్ హెల్త్చెకప్ శిబిరాన్ని బుధవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సమాచారశాఖ కమిషనర్ కార్యాలయంలో ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. మహిళా జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించారని గుర్తుచేశారు. ఈ శిబిరంలో ఏప్రిల్ 9 వరకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 36 రకాల వైద్య పరీక్షలు చేస్తారని వెల్లడించారు. గైనకాలజీ వైద్యసేవలు, అల్ట్రాసౌండ్, ఎక్స్రేతోపాటు క్యాన్సర్ స్క్రీనింగ్, కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. త్వరలో జిల్లా కేంద్రాల్లో కూడా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు.
సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్ అరవింద్కుమార్ మాట్లాడు తూ.. అక్రెడిటెడ్ మహిళా జర్నలిస్టులు ఈ అవకాశా న్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మహంతి, ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జయలలిత, సమాచారశాఖ డైరెక్టర్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.