మహబూబ్నగర్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ దేవస్థానం వద్ద శాంతానారాయణగౌడ్, లక్ష్మీవేంకటేశ్వరస్వామి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తాధ్వర్యంలో మే 7న ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ..
మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పేద జంటలకు వివాహాలు జరిపించనున్నట్టు చెప్పారు. ఈ మేరకు మన్యంకొండ దేవస్థానంలో అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. పేదింటి జంటలు ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని, వాళ్లందరికీ పట్టువస్ర్తాలు, పెండ్లికి కావాల్సిన సామగ్రిని ఉచితంగా సమకూరుస్తామని మంత్రి పేర్కొన్నారు. వంద మందికి ఒకేసారి పెండ్లి చేసేలా మన్యంకొండ ఆలయం వద్ద పెద్ద హాలు నిర్మిస్తున్నామని, కొత్త జంటలు వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని గుట్టపై ఒకరోజు ఉండేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
రూ.25 కోట్లతో నిత్యాన్నదాన సత్రం, 20 గదులతో వసతి కేంద్రం, రూ.5 కోట్లతో ప్రసాదం కౌంటర్ను నిర్మిస్తున్నామని వివరించారు. మన్యంకొండ ఆలయానికి 320 ఎకరాల భూమి ఉన్నదని, అందులో అద్భుతంగా నందనవనం తీర్చిదిద్దుతామని వెల్లడించారు. రాష్ట్రంలోనే తొలి రోప్వే సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని, మూడు మల్టీనేషనల్ కంపెనీలు టెండర్లు వేశాయని, త్వరలో వాటిని ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.