ఉచిత వసతి, భోజనం, ట్యూషన్ ఫీజుల చెల్లింపునకు నిర్ణయం
బీసీ స్టడీ సర్కిల్ సహకారం.. కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహకారం
హైదరాబాద్ చంపాపేట హాస్టల్లో నేరుగా ఫ్యాకల్టీతోనే పాఠాలు
హైదరాబాద్, మార్చి30 : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ కోటా కింద దాదాపు 3,200 ఉద్యోగాలు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో వారికి ఉచితంగా శిక్షణ అందించేందుకు రాష్ట్ర దివ్యాంగ సంక్షేమ శాఖ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నది. బీసీ స్టడీ సర్కిల్ సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగ అభ్యర్థులకు సైతం ఉచితంగా శిక్షణ అందించేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నది. ప్రతి నియోజకవర్గంలో ఒక స్టడీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు జిల్లాల వారీగా దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఈ స్టడీ సెంటర్లలో తొలివిడతగా 500 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించడంతోపాటు ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఖర్చులను వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ ద్వారా అందించాలని నిర్ణయించింది.
హైదరాబాద్ చంపాపేట్లోని వసతి గృహంలో దివ్యాంగ యువతీ, యువకులకు వేర్వేరుగా శిక్షణ తరగతులను ప్రారంభించనున్నది. గ్రూప్స్, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంక్, యూపీఎస్పీ తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలను బోధించే అధ్యాపకులను నేరుగా హాస్టల్కే రప్పించాలని, అంధులకు బ్రెయిలీ లిపిలో ముద్రించిన స్టడీ మెటీరియల్ను అందజేయాలని నిర్ణయించింది.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నియామకాలు జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం హర్షణీయం. పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా దివ్యాంగ అభ్యర్థులకు అండగా నిలుస్తాం. వారికి స్టడీ మెటీరియల్ అందజేసి ఉచితంగా శిక్షణ ఇస్తాం. హాస్టల్ ఫీజులు సైతం చెల్లిస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దివ్యాంగ అభ్యర్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలి. జిల్లాల డీడబ్ల్యూవోలకు దరఖాస్తు చేసుకోవాలి.
– వాసుదేవరెడ్డి, వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్