హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి10 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఉచిత కరెంటు మార్గదర్శకాల్లో ప్రభుత్వం సల్వమార్పులు చేసింది. నాయీబ్రాహ్మణులు, రజక సంఘాల విజ్ఞప్తుల మేరకు 250 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటును ఇవ్వడంతో పాటు, ఆ కనెక్షన్కు సరిపడా వైర్, కొత్త మీటర్ ఖర్చును కూడా ప్రభుత్వమే భరించనున్నది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. సెలూన్, లాండ్రీ షాపులకు 250 యూనిట్లలోపు విద్యుత్ను ఉచితంగా అందిస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని గత ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నారు. కొత్తమీటర్, వైర్ ఖర్చును లబ్ధిదారులు భరించాల్సి ఉంది. తాజాగా రజక, నాయీబ్రాహ్మణ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆ మార్గదర్శకాలను ప్రభుత్వం సవరించింది. ఉచిత విద్యుత్తో పాటు, కనెక్షన్కు అవసరమైన ఖర్చును కూడా ప్రభుత్వమే భరించనుంది. ఈ నిర్ణయంతో గ్రేటర్ పరిధిలో సుమారు 25 వేల సెలూన్లకు, తద్వారా ఉపాధి పొందుతున్న సుమారు రెండు లక్షల మందికి ప్రయోజనం చేకూరనున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో 20 వేల లాండ్రీ షాపులు, 52 దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ వర్తించనుండడంతో రజకులకు మేలు చేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయంపై నాయీ బ్రాహ్మణులు, రజకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. లాండ్రీలు, దోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. లబ్ధిదారులకు మరింత మేలు చేకూర్చేందుకు ఉచిత విద్యుత్ కనెక్షన్కు కరెంటు మీటర్లు, వైర్ను కూడా అందించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– కొండూరు సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర రజకసంఘాల సమితి ప్రధాన సలహాదారు