హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): సింగరేణి ఏరియాల్లోని నిరుద్యోగ యువతకు ఉచిత డ్రైవింగ్ (ఎల్ఎంవీ, హెచ్ఎంవీ) శిక్షణ ఇప్పించాలని సింగరేణి సంకల్పించింది. దీనికోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్(టైడ్స్)తో సింగరేణి కాలరీస్ ఒప్పందం కుదుర్చుకొన్నది. సోమవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జీఎం సూర్యనారాయణ, టైడ్స్ సెక్రటరీ, ప్రిన్సిపాల్ రియాజ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, అశోక్ లేలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టైడ్స్లో యువతకు నెలరోజుల శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఒక్కో బ్యాచ్కు 25 మంది చొప్పున 4 నెలల్లో 100 మందికి శిక్షణ ఇప్పిస్తామని, అభ్యర్థులకు ఉచిత భోజన వసతి ఉంటుందని వివరించారు. దీనికోసం సింగరేణి రూ.25 లక్షలు వెచ్చిస్తున్నదని చెప్పారు. అత్యాధునిక పద్ధతిలో శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలు సైతం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. సింగరేణి ప్రాంతాల్లోని పీఏఎఫ్, పీడీఎఫ్, ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గలవారు తమ ఏరియాలోని సింగరేణి సేవా సమితి లేదా కో ఆర్డినేటర్ ఆఫీసర్కు దరఖాస్తు చేయాలన్నారు. కార్యక్రమంలో సింగరేణి ఏజీఎం రాజేశ్వరరావు, డీజీఎం విజేందర్రెడ్డి, ఎస్వోఎం కృష్ణమాచారి, సీనియర్ పీవో శ్రీకాంత్, సింగరేణి సేవా సమితి కోఆర్డినేటర్ కిశోర్ పాల్గొన్నారు.