హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం వరకు 67 లక్షల పుస్తకాలను జిల్లాలకు తరలించారు. ఇవి మొత్తం పుస్తకాల్లో 41శాతంతో సమానం. ఈ నెలాఖరులో 70%, జూలై రెండో వారం నాటికి 100% పాఠ్యపుస్తకాలను జిల్లాలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 1-10 తరగతులకు అన్ని పుస్తకాలు క్యూఆర్ కోడ్తో అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో 1వ తరగతికి పూర్తిగా ఇంగ్లిష్ మీడియం, 2-8 తరగతులకు ద్విభాషా పుస్తకాలు (తెలుగు, ఇంగ్లిష్) ముద్రించారు. ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా ఈ పుస్తకాలను జిల్లాలకు చేరుస్తున్నారు. తాజాగా ముద్రించిన పాఠ్యపుస్తకాలు సమ్మేటివ్ అసెస్మెంట్ -1(ఎస్ఏ-1) కోసం మాత్రమే ఉపయోగపడుతాయి. ఎస్-2 పుస్తకాలు ఆగస్టు, సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయి. 2-8 తరగతుల్లోని విద్యార్థులకు ద్విభాషా పుస్తకాలను ముద్రిస్తుండటంతో బరువు తగ్గించేందుకు వాటిని రెండు భాగాలుగా విభజించారు. దీంతో పుస్తకాల సంఖ్యతో పాటు ముద్రణ వ్యయం పెరిగింది. నిరుడు పుస్తకాల కోసం రూ.60 కోట్లు వెచ్చించగా, ఈ ఏడాది రూ.120 కోట్లు వెచ్చించారు.
సోమవారం నుంచి పుస్తక విక్రయాలు
ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు విక్రయించేందుకు ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణ సంస్థ ద్వారా ఈ ఏడాది 1.22 కోట్ల పుసక్తకాలను ముద్రించారు. వీటిని సోమవారం నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంచనున్నారు. పాఠశాల విద్యాశాఖ గుర్తించిన బుక్స్టాళ్లు, ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లోని పుస్తక ముద్రణసంస్థ వద్ద ఏర్పాటుచేసిన కౌంటర్లో ఈ పుస్తకాలను విక్రయిస్తారు. ఈ విద్యా సంవత్సరం విక్రయ పుస్తకాల ధరలు భారీగా పెరిగాయి. మొత్తంగా ధరలు 54% పెరిగినట్టు అధికారులు తెలిపారు. పేపర్ ధరలు పెరగడంతో పుస్తకాల ధరలు పెంచక తప్పలేదని పేర్కొన్నారు.