రాష్ట్ర ఆర్థిక నిర్వహణ సమర్థంగా ఉన్నది
ఉచిత పథకాల ప్రభావం చాలా తక్కువ
జాతీయ ఆర్థిక నిపుణుల విశ్లేషణ
హైదరాబాద్, ఏప్రిల్ 20, (నమస్తే తెలంగాణ): ఉద్దీపనల పేరుతో ఉన్నవారికి ప్రభుత్వం వేలకోట్ల ఉచితాలు ఇస్తున్నా నోరు మెదుపని కొందరు ఆర్థిక నిపుణులు, అట్టడుగున ఉన్న పేదలను అభివృద్ధిలోకి తేవటానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ‘ఉచిత’ పథకం ప్రకటించగానే దేశం నాశనమైనట్టే అన్నంతగా గగ్గోలు పెడుతున్నారు.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలతో దేశం భవిష్యత్లో శ్రీలంక మాదిరిగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ప్రధానికి ఉన్నతాధికారులు నివేదించినట్టు వచ్చిన వార్తలు మరోసారి ఈ చర్చను లేవనెత్తాయి. అయితే, ఆర్థిక నిర్వహణ సమర్థంగా ఉంటే ఉచిత పథకాలతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని, అందుకు తెలంగాణ రాష్ట్రమే ఉదాహరణ అని కొందరు ఆర్థికవేత్తలు అంటున్నారు. ఆర్థిక స్థోమతను బేరీజు వేసుకోకుండా ఉచిత పథకాలు అమలుచేసిన చోటే సమస్యలు వస్తాయని చెప్తున్నారు.
సంక్షేమం, సమర్థ నిర్వహణ
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలుచేస్తున్నది. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, దళితబంధు వంటి భారీ పథకాలు సమర్థంగా అమలవుతున్నాయి. అయినా పంజాబ్, పశ్చిమబెంగాల్ మాదిరిగా తెలంగాణ ఆర్థిక స్థితి బలహీనంగా లేదని ఆర్థికవేత్తలు అంటున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు తదితర పథకాలకు రూ.15 వేల కోట్లు కేటాయించింది. ఇతర పథకాలకు కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. అయినప్పటికీ రాష్ర్టానికి రూ.4,395 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నదని, ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీలో 0.38 శాతమని గుర్తు చేస్తున్నారు.