హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాష్ర్టాలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా ఎఫ్ఆర్బీఎం రుణాలను జీఎస్డీపీలో మళ్లీ 3.5 శాతానికే (విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే అదనంగా మరో 0.5 శాతం) పరిమితం చేస్తున్నట్టు బుధవారం బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని 5 శాతానికి పెంచాలని తెలంగాణ సహా అనేక రాష్ర్టాలు చేసిన విజ్ఞప్తులను బుట్టదాఖలు చేశారు. దీంతో రాష్ర్టాల నిధుల సమీకరణ గణనీయంగా తగ్గనున్నది.
వాస్తవానికి దేశంలోని ఏ రాష్ట్రమైనా తన స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో గరిష్ఠంగా 25% వరకు రుణాలను సమీకరించుకోవచ్చు. అందులో భాగంగా ఏటా 5% వరకు రుణాలను సమీకరించుకునే అవకాశం కల్పించాలని తెలంగాణ దీర్ఘకాలం నుంచి కోరుతున్నది. ఈ విషయమై సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ఇప్పటికే అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్డీపీ రూ.11.48 లక్షల కోట్లు. ఈ లెక్కన కేంద్రం ఎఫ్ఆర్బీఎం రుణాలను 3.5 శాతానికి బదులుగా 5% వరకు సమీకరించుకునే అవకాశం కల్పిస్తే ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో తెలంగాణకు అదనంగా మరో రూ.18 వేల కోట్లు సమకూరేవి. దీనికి అదనంగా విద్యుత్తు సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల తెలంగాణ మరో రూ.6 వేల కోట్లను నష్టపోయింది. విద్యుత్తు సంస్కరణలను అమలు చేయకపోతే 0.5 శాతం ఎఫ్ఆర్బీఎం ఇవ్వడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పడమే ఇందుకు కారణం. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో మోదీ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ మొత్తంగా రూ.24 వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది.