రాంనగర్(కరీంనగర్) ఫిబ్రవరి 21: ఖాతాదారులను మోసం చేసి సొంత ఆస్తులు కూడబెట్టుకున్న అక్షర చిట్ఫండ్ చైర్మన్, ఇద్దరు డైరెక్టర్లను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మకొండలోని సుబేదారి ఎస్బీహెచ్ కాలనీకి చెందిన పేరాల శ్రీనివాసరావు అక్షర చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేసి తన భార్య శ్రీవిద్యతోపాటు మరో నలుగురిని డైరెక్టర్లుగా నియమించారు.
పెద్ద ఎత్తున ఖాతాదారులను నమ్మించి డిపాజిట్లు సేకరించి అక్షర టౌన్షిప్ పేరిట స్థిరాస్తులను కొనుగోలు చేశాడు. వారి దగ్గర చిట్టి వేసి మోసపోయిన రిటైర్డ్ ఉద్యోగి శ్రీరాం వెంకట్రెడ్డి ఫిర్యాదుతో.. అక్షర చిట్ఫండ్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావు, డైరెక్టర్లు సూరినేని కొండాల్రావు, ఉప్పల రాజేందర్ను ఆరెస్ట్ చేశారు. మరో ముగ్గురు డైరెక్టర్లు పేరాల శ్రీవిద్య, వరప్రసాద్, గోనె రమేశ్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.