హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఘటనలో 30 మంది ఆరోగ్యంగా ఉన్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల తర్వాత నలుగురు మహిళలు చనిపోవడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి వచ్చిన క్షణం నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఇబ్రహీంపట్నంలో కు.ని. ఆపరేషన్లు చేయించుకున్న మిగతా 30 మందిని ముందుజాగ్రత్తగా ప్రభుత్వం దవాఖానకు తరలించి వైద్యుల పరిశీలనలో ఉంచింది. ఇందులో 13 మందిని అపోలో దవాఖానలో, 17 మందిని నిమ్స్లో ఉంచారు. నిమ్స్లో చికిత్స పొందుతున్నవారిని మంత్రి హరీశ్రావు బుధవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి సహాయకులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇన్ఫెక్షన్ వల్లే నలుగురు మరణించినట్టు ప్రాథమికంగా తెలిసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా మిగతా 30 మందిని దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నదని వివరించారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నారని, రెండుమూడు రోజుల్లో డిశ్చార్జి అవుతారని చెప్పారు. ఆరేడేండ్లలో సుమారు 12 లక్షల కు.ని. ఆపరేషన్లు చేశామని, ఇప్పటివరకు ఎలాంటి ఘటన జరగలేదన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నదని, సూపరింటెండెంట్ను సస్పెండ్ చేశామని, సర్జరీ చేసిన డాక్టర్ లైసెన్స్ను మెడికల్ కౌన్సిల్ తాత్కాలికంగా రద్దు చేసిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించామని, డబుల్ బెడ్రూం మంజూరు చేస్తామని చెప్పారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని, కమిటీ నివేదిక రాగానే పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మరోవైపు రేయింబవళ్లు బాధితుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ప్రతిపక్ష నేతలు వచ్చి మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. కానీ ప్రభుత్వం, వైద్యశాఖ.. విషయం తెలిసిన క్షణం నుంచి మిగతావారి ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన కృషి చేస్తున్నాయని అన్నారు. అంబులెన్స్లు పంపి ఇండ్లలో ఉన్నవారిని తీసుకొచ్చి దవాఖానల్లో చేర్చామని తెలిపారు. వారందరికీ ఉచితంగా చికిత్స అందిస్తున్నామని, వారి సహాయకులకు ఖర్చుల కోసం రూ.10 వేలు అందిస్తున్నామని వివరించారు. ఆరోగ్యశాఖ అధికారులు ఇకడే ఉంటూ వారిని గంట గంటకూ మానిటర్ చేస్తున్నారని అన్నారు. తాము రాజకీయాలు చేయబోమని, ప్రజల ప్రాణాలు కాపాడటమే తమ లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతామని తెలిపారు.
ఇబ్రహీంపట్నం ఘటనపై సమగ్ర నివేదిక వచ్చే వరకు ప్రత్యేక క్యాంపుల్లో ‘డీపీఎల్’ (డబుల్ పంక్చర్ లాప్రొస్కోపీ) విధానంలో చేసే సర్జరీలను తాత్కాలికంగా నిలిపివేయాలని వైద్యాధికారులు నిర్ణయించారు. ఇతర విధానాల్లో కు.ని. ఆపరేషన్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టంచేశారు. కు.ని. ఆపరేషన్లు పూర్తిగా నిలిపివేశారంటూ వస్తున్న కథనాలు అవాస్తవమని టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం క్యాంపుల్లో డీపీఎల్ విధానం మాత్రమే నిలిపివేశామని పేర్కొన్నారు. నివేదిక వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా సురక్షిత విధానంలో ఆపరేషన్లు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపడుతామని చెప్పారు.