హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఇక్కడి అభివృద్ధిని చూసి చాలా ఇంప్రెస్ అయ్యానని ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్, సీఈవో యంగ్ లియు పేర్కొన్నారు. హైదరాబాద్లోని రాయదుర్గం ఐటీ కారిడార్లో తెలంగాణ సర్కారు దేశంలోనే మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన అతిపెద్ద ప్రొటోటైపింగ్ సెంటర్ (టీ-వర్క్స్)ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్తో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించిన టీ-వర్క్స్ భవనాన్ని కళ్లు మిరుమిట్లు గొలిపే లేజర్ షో వెలుగుల మధ్య ఆవిష్కరించారు. అనంతరం యంగ్ లియు మాట్లాడుతూ, తెలంగాణ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఇదే వేగంతో పనిచేస్తే రాబోయే నాలుగేండ్లలో డబుల్ రెవెన్యూ సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఏడేండ్లలో తెలంగాణ ఎంత అభివృద్ధి సాధించిందో సీఎం కేసీఆర్ తనకు వివరించారని చెప్పారు. తెలంగాణ తనకు చాలా బాగా నచ్చిందని తెలిపారు. టీ- వర్స్కు తమ కంపెనీ తరఫున హైఎండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులను అసెంబ్లింగ్ చేసేందుకు ఉపయోగించే సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ (ఎస్ఎంటీ ) లైన్ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. తెలంగాణపై తనకు విశ్వాసం కలిగిందని, ఈ రాష్ట్రంతో కలిసి పనిచేయడం వల్ల ఫాక్స్కాన్ ఆదాయాన్ని రెట్టింపు చేసే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన టీ -వర్క్స్ కాన్సెప్ట్ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఈ ప్రపంచస్థాయి సదుపాయాన్ని ఎంతో వేగంగా నిర్మించిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకొన్నదని తెలిపారు. టీ-వర్క్స్తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
పారిశ్రామిక విప్లవంలో టీ-వర్క్స్ పునాది: సుజయ్ కారంపూరి
పారిశ్రామిక విప్లవంలో టీ-వర్క్స్ ఒక పునాది దశవంటిందని టీ వర్క్స్ సీఈవో సుజయ్ కారంపురి అభివర్ణించారు. ఇది కేవలం భవనం మాత్రమే కాదని, రకరకాల వస్తువులను సరికొత్త ఆలోచనలతో రూపొందించుకొనే వారికి ఒక చక్కటి వేదిక అని పేర్కొన్నారు. 60 మంది సభ్యులతోకూడిన బృందం ఎంతో కష్టపడి దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు. టీ-వర్క్స్లో మొత్తం రూ.110 కోట్ల విలువ చేసే యంత్రాలను అందుబాటులో ఉంచుతామని, వాటిని ఎవరైనా వచ్చి తమకు నచ్చినవిధంగా వస్తువుల నమూనాలను తయారు చేసుకొనేందుకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్, పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
ఆకట్టుకొన్న బొంగరం జ్ఞాపిక
టీ-వర్క్స్ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులకు సరికొత్త జ్ఞాపికను అందజేశారు. టీ-వర్క్స్లోని యంత్రాలపైనే రూపొందించిన బొంగరాన్ని ప్రత్యేకంగా రూపొందించిన ప్యాకేజ్లో ఉంచి, ఆహూతులకు ప్రదానం చేశారు. రోబోటిక్ చేతుల మీదుగా బొంగరాలను ప్రత్యేకంగా అందించే ఏర్పాటు చేశారు. ఈ జ్ఞాపిక చాలా వినూత్న డిజైన్, పనితీరుతో ఉందని అతిథులు అభిప్రాయపడ్డారు. అలా గే, టీ-వర్క్స్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రత్యేకంగా లేజర్షోను నిర్వహించారు. టీ-వర్క్స్ ప్రాముఖ్యతను తెలియజేసేలా లేజర్ షోలో పలు డిజైన్లను ప్రదర్శించారు.
ఐటీలో ప్రపంచవ్యాప్త గుర్తింపు: మంత్రి కేటీఆర్
దేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ రంగంలో హైదరాబాద్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందని వెల్లడించారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదని.. ఇండియా-తైవాన్ అని కొత్త అర్థం చెప్పారు. ఇండియా-తైవాన్ కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. భారత్ నుంచి సాఫ్ట్వేర్ నైపుణ్యం, తైవాన్ నుంచి హార్డ్వేర్ నైపుణ్యంతో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టవచ్చని తెలిపారు. యువతరం ప్రపంచస్థాయి ఉత్పత్తులను రూపొందించేలా సహకారం అందిస్తామని చెప్పారు. ఫాక్స్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నదని తెలిపారు. తెలంగాణలో లక్షమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రకటించిన యంగ్ లియుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో అతిపెద్ద ప్రొటో టైపింగ్ సెంటర్ అయిన టీ-వర్స్ ప్రారంభోత్సవానికి ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియు రావడం చాలా సంతోషంగా ఉందని, ఆయనతోపాటు తన బృందానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతుపున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
టీ-వర్క్స్తో భారత్ ముందడుగు: ఆనంద్ మహీంద్రా
టీ-వర్క్స్తో అధునాతన ఉత్పత్తుల తయారీరంగంలో ప్రపంచానికి భారత్ గమ్యస్థానంగా మారుతుందని మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు హైదరాబాద్లో ఏర్పాటుచేసిన దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ సెంటర్ టీ-వర్క్స్ తయారీ రంగం మరింత ఊపందుకొనేందుకు దోహదపడుతుందని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఆనంద్ మహీంద్రా ట్వీట్ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.
టీ-వర్స్తో సృజనాత్మకత వెలికితీత : మహేశ్బిగాల
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దూరదృష్టి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలతో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తున్నదని గ్లోబల్ బీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. టీ-వర్క్స్ ప్రారంభంతో హార్డ్వేర్ రంగంలో తెలంగాణ యువత అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే టీ-హబ్ ద్వారా సాఫ్ట్వేర్ రంగంలో దూసుకుపోతున్నారని స్పష్టం చేశారు. గ్రామీణప్రాంత ఔత్సాహిక యువతలో సృజనాత్మకతను వెలికితీసేందుకే తెలంగాణ సర్కారు టీ-వర్క్స్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ తీసుకొంటున్న చర్యలవల్ల రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చిందని పేర్కొన్నారు. ఫాక్స్కాన్ సంస్థ పెట్టుబడులతో రాష్ట్రంలో లక్షమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టబోయే ఫాక్స్కాన్.. తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకొన్నదని మహేశ్ బిగాల పేర్కొన్నారు.