Nirmal | నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని తాటిగూడ గ్రామంలో విషాదం నెలకొంది. వీధి కుక్కల దాడిలో గాయపడిన ఓ నాలుగేండ్ల చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళ్తే.. తాటిగూడ గ్రామానికి చెందిన అమర్ సింగ్, సరిత దంపతులకు కూతురు భూక్యా శాన్వి(4) ఉంది. అయితే మార్చి 2వ తేదీన ఇంటి ముందు ఆడుకుంటున్న శాన్విపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆ పాపకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది శాన్వి. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, కుక్కలను తరిమేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు అమర్ సింగ్ మొర పెట్టుకున్నాడు. పెంబి మండల పరిధిలోని పలు గ్రామాల్లో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయని స్థానికులు పేర్కొన్నారు. దీంతో పిల్లలు, వృద్ధుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.