హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఒకరు రచయిత, మరొకరు ఆవిష్కర్త, ఇంకొకరు సైబర్ సెక్యురిటీలో దిట్ట, తల్లిని కోల్పోయినా ప్రతిభతో ఓయూలో సీటు సంపాదించింది ఇంకో బాలిక. వారే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీజ, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ధీరావత్ అనిత, హైదరాబాద్కు చెందిన కశిష్సింగ్, కే సోను. ఈ నలుగురు తమకున్న ప్రత్యేకతలో జాతీయస్థాయిలో యంగ్ అచీవర్స్గా నిలిచారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ నలుగురుని కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసింది. సోమవారం కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్తో వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 75 మంది బాలికలు పాల్గొనగా, తెలంగాణ నుంచి నలుగురు బాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన విద్యార్థులను అభినందించారు.