మందమర్రి, సెప్టెంబర్ 3 : మేకను ఎత్తుకెళ్లాడనే నెపంతో దళితులను చిత్రహింసలకు గురిచేసిన నలుగురిని అరెస్ట్ చేసినట్టు బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య తెలిపారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెల్లడించిన వివరాల ప్రకా రం.. మందమర్రిలోని యాపల్ ఏరియాకు చెందిన రాములు-స్వరూప దంపతులతోపాటు వారి కుమారుడు శ్రీనివాస్ అదే ఏరియాలో షెడ్డు నిర్మించి మేకలు పెంచుతున్నారు. ఇటీవల మందలో నుంచి ఓ మేక కనిపించకుండా పోయింది. మేకను దొంగతనం చేశారనే అనుమానంతో ఈ నెల ఒకటిన అదే ప్రాంతానికి చెందిన కిరణ్, తేజను షెడ్డుకు పిలిపించారు.
పైవాసానికి తాడుతో వేలాడదీసి కొట్టగా, మొదట షెడ్డులోని ఇనుప పైపు ను దొంగతనం చేసినట్టు ఒప్పుకొన్నారు. పైపును దాచిన ప్రదేశాన్ని చూపెట్టడంతో అక్కడ నుంచి పైపును తీసు కువచ్చారు. మేక ను కూడా ఎత్తుకెళ్లారంటూ ఆ ఇద్దరిని షెడ్డు పైవాసానికి వేలాడదీసి కింద మంట పెట్టి మరోసారి చిత్రహింసలకు గురిచేయగా, తామే దొంగతనం చేసినట్టు అంగీకరించారు. తేజ తల్లి, కిరణ్ చిన్నమ్మ వచ్చి డబ్బులు చెల్లిస్తామని చెప్పి వారిని విడిపించుకెళ్లింది. ఆ తరువాత ఆమె శనివారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి రాములు, స్వరూపతోపాటు వారి కుమారుడు శ్రీనివాస్ను శనివారం రాత్రి అరెస్టు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మంచిర్యాల కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నిందితులకు సహకరించిన నరేశ్ను ఆదివారం అరెస్ట్ చేసినట్టు ఏసీపీ తెలిపారు.