హైదరాబాద్ : నిమ్స్ వైద్యులు రికార్డు సృష్టించారు. కేవలం 24 గంటల్లోనే నాలుగు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు నిర్వహించి అద్వితీయమైన ఘనత సాధించారు. రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సను ఆరోగ్య శ్రీ పథకం కింద పేద రోగులకు ఉచితంగా నిర్వహించారు. గత నాలుగైదు సంవత్సరాల నుంచి డయాలసిస్ చికిత్స పొందుతున్న బాధితులకు బ్రెయిన్ డెడ్ అయిన ముగ్గురు రోగుల నుంచి కిడ్నీలను మార్పిడి చేశారు. ఒకరేమో బతికుండగానే కిడ్నీని దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ నాలుగు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా విజయవంతం అయ్యాయని నిమ్స్ వైద్యులు ప్రకటించారు.
నిమ్స్ యూరాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ రాంరెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ రామచంద్రయ్య, డాక్టర్ రఘువీర్, డాక్టర్ చరణ్ కుమార్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ వినయ్, డాక్టర్ సునీల్, డాక్టర్ అరుణ్, డాక్టర్ జానకి, డాక్టర్ విష్ణు, డాక్టర్ పవన్, డాక్టర్ హర్ష, డాక్టర్ సూరజ్, డాక్టర్ పూవరసన్, డాక్టర్ అనంత్, డాక్టర్ షారూక్, అనస్థషీయా డాక్టర్లు డాక్టర్ పద్మజా, డాక్టర్ నిర్మల, డాక్టర్ ఇందిరా, డాక్టర్ గీత కలిసి శస్త్ర చికిత్సలు నిర్వహించారు.