వరంగల్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాలుగు దిక్కులా 30 అడుగుల ఎత్తయిన భారీ తోరణ ద్వారాలు.. లోపల నాలుగు నంది మండపాలు.. అద్భుత శిల్పకళా వైభవానికి నిలువుటద్దంగా ఎత్తయిన స్తంభాలు.. మధ్యలో సద్యోజాత, వామదేవ, అఘోర, ఈశాన.. చతుర్ముఖ రూపంలో కొలువైన శివలింగం. ఒక్కో ద్వారం నుంచి ఒక్కో రూపంలో కనిపించే ఈ అరుదైన చతుర్ముఖ శివలింగం వరంగల్ కోటలోని సర్వతోభద్ర ఆలయంలో ఉన్నది. దీని ఆనవాళ్లను అమెరికా బోస్టన్లోని వెస్లియాన్ యూనివర్సిటీ పురావస్తు పరిశోధకుడు ప్రొఫెసర్ ఫిలిప్ బీ వాగనర్ వెలుగులోకి తెచ్చారు. ఆయన హంపి వంటి ఎన్నో చారిత్రక ప్రదేశాలపై అధ్యయనం చేశారు. ఓరుగల్లు కోటలోని తోరణాలతోపాటు ఈ ఆలయ చారిత్రక అంశాలను ఎన్నింటినో వెలుగులోకి తెచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో టూర్గైడ్ కోసం ఇక్కడికి వచ్చిన ఆయన, వీటిపై అధ్యయనం చేసి ఓ నివేదిక రూపొందించారు. కోట దగ్గరలోని శంభుని గుడి ప్రాంగణంలో చతుర్ముఖ లివలింగాన్ని చూసి అది సర్వతోభద్ర ఆలయమై ఉండొచ్చని భావిస్తున్నారు. 1220-1240 మధ్యలో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించిట్టు తెలుస్తున్నది.