ధారూరు/పూడూరు, జనవరి 16: వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టులో సోమవారం నలుగురు యువకులు మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని పూడూర్ మండలం మన్నెగూడ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన బైకాని లోకేశ్ (28), బైకాని వెంకటేశ్ (25), బైకాని జగదీశ్ (24), ఆవుదొడ్డి రాజేశ్ (24) తమ కుటుంబసభ్యులతో కలిసి (మొత్తం 12 మంది) కారు, ఆటోలో సోమవారం కోట్పల్లి ప్రాజెక్టుకు వచ్చారు. ప్రాజెక్టు నీటిలో ఆడుతూ గంటకుపైగా సరదాగా గడిపారు. ఈ క్రమంలో రాజేశ్, వెంకటేశ్కు దమ్మురావడంతో నీటిలో మునుగుతున్నారని గమనించి ఈత వచ్చిన జగదీశ్, లోకేశ్ రక్షించే ప్రయత్నం చేశారు. అక్కడ లోతు ప్రదేశం, బురదమట్టి ఉండటంతో వారి ప్రయత్నం విఫలమై వారు కూడా బురదలో చిక్కుకున్నారు. మరో వ్యక్తి కళ్యాణ్ స్థానికులకు తెలిపి గల్లంతు అయినవారిని స్థానికుల సహాయంతో బయటకు తీశారు. పోలీసులు మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.