TG Weather | తెలంగాణలో రాగల మూడు నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. దాని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఉందని చెప్పింది. ఈ క్రమంలో ఆదివారం కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
సోమ, మంగళవారాల్లో పలుచోట్లు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉందని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఖమ్మం, కొత్తగూడెంలో వర్షాలు కురిశాయని టీజీడీపీఎస్ వివరించింది.