హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): దేశ జనాభాలో సగం మందికిపైగా.. అంటే సుమారు 67 కోట్ల మందికి పెండ్లి కాలేదట. ఇందులో చిన్న పిల్లలు మొదలు అన్ని రకాల వయసుల వారున్నారు. వివాహం అయినవారిలో పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువగా ఉన్నారట. దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది వివిధ కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్నారట. ఇటీవల విడుదలైన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ గణాంకాల నివేదిక – 2020’లో ఇలాంటి పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
నివేదికలోని కీలక అంశాలు
దేశ జనాభాలో 51.6 శాతం (67 కోట్లు) మందికి పెండ్లి కాలేదు. అవివాహితుల జాబితాలో పురుషులే అధికంగా ఉన్నారు. పురుషుల్లో 56.7 శాతం మందికి, మహిళల్లో 46.2 శాతం మందికి ఇంకా పెండ్లి కాలేదు.
బ్రహ్మచారుల జనాభా అత్యధికంగా బీహార్లో (59.3 శాతం) ఉండగా, తెలంగాణలో 47.4 శాతం ఉన్నరు.
దేశ జనాభాలో 45.2 శాతం మందికి వివాహం అయినట్టు నివేదిక వెల్లడించింది. పెండ్లయినవారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు.
పురుషుల్లో 41.8 శాతం మందికి పెండ్లికాగా.. మహిళల్లో 48.8 శాతం మంది వివాహం చేసుకున్నారు.
తెలంగాణ జనాభాలో వివాహితులు 48.6 శాతం మంది ఉన్నారు. వివాహితుల జాబితాలో ఏపీ 52.4 శాతంతో టాప్లో నిలిచింది.
భర్త/భార్య మరణించడం, విడాకులు తీసుకోవడం, గొడవల కారణంగా వేర్వేరుగా ఉండటం వంటి కారణాలతో ఒంటరి జీవితం గడుపుతున్నవారు దేశ జనాభాలో సుమారు 3.2 % (4 కోట్లు) మంది ఉన్నారు.
మహిళల జనాభాలో 5 శాతం మంది ఒంటరిగా ఉంటుండగా, పురుషుల్లో 1.4 శాతం మంది ఒంటరి జీవులుగా ఉన్నారని నివేదిక వెల్లడించింది.
ఒంటరిజీవుల్లో తమిళనాడు టాప్లో నిలిచింది. ఆ రాష్ట్ర జనాభాలో సుమారు 5.2 శాతం మంది ఒంటరి జీవితం గడుపుతున్నట్టు నివేదిక వెల్లడించింది. అక్కడ పురుషులు 1.2 శాతం ఉండగా, మహిళలు ఏకంగా 8.8 శాతం మంది ఒంటరిగా ఉంటున్నారు.
తెలంగాణలో 4.1% మంది ఒంటరిగా ఉంటున్నట్టు నివేదిక వెల్లడించింది. పురుషుల్లో 1.6%, మహిళల్లో 6.6% మంది ఒంటరి జీవితం గడుపుతున్నారని పేర్కొన్నది.
దేశ జనాభాలో 8.1 శాతం (10.5 కోట్లు) మంది 60 ఏండ్లకు పైబడినవారు ఉన్నారు. రాష్ర్టాలవారీగా చూస్తే కేరళలో అత్యధికంగా ఆ రాష్ట్ర జనాభాలో సుమారు 12.9 శాతం మంది 60 ఏండ్లకు పైబడినవారు ఉన్నారు.
తెలంగాణ జనాభాలో 8.1% మంది వృద్ధులున్నారు. రాష్ట్ర వృద్ధ జనాభాలో మహిళలు, పురుషులు సమానంగా ఉండటం విశేషం. పురుషుల్లో 8.1% మంది, మహిళల్లో 8.1% మంది 60 ఏండ్లకు పైబడి ఉన్నారు.