హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ. 231 కోట్ల బోధన్ బోగస్ చలాన్ల కేసులో మంగళవారం మరో నలుగురు అరెస్టయ్యారు. వీరితో కలిపి ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 21కి చేరింది. నిందితులు విజయ్కుమార్, రాజయ్య, సాయిలు, స్వర్ణలతను పోలీసులు కరీంనగర్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం వీరిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ సందర్భంగా సీఐడీ ఏడీజీ మహేశ్ భాగవత్ మాట్లాడుతూ ఈ మొత్తం కుంభకోణంలో సింహాద్రి లక్ష్మీశివరాజు, ఆయన కుమారుడు వెంకట సునీల్ ప్రధాన సూత్రధారులని పేర్కొన్నారు.
వాణిజ్యపన్నుల శాఖలోని అధికారుల సహకారంతో నకిలీ చలాన్లు సృష్టించి, అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి 2012 నుంచి నకిలీ చలాన్లను విక్రయించగా ప్రభుత్వ ఖజానాకు రూ.231కోట్ల నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నారు. బోధన్ పోలీస్ స్టేషన్లో 2017లో కేసు నమోదు కాగా, తదుపరి విచారణ కోసం సీఐడీకి బదిలీ చేశారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేయగా, తాజాగా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు చెప్పిన మహేశ్ భాగవత్ నిందితుల అరెస్టులో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని అభినందించారు.