అంబర్పేట, జూన్ 10: రెడ్డి హాస్టల్ స్థాపించిన రాజబహద్దూర్ వెంకటరామిరెడ్డి (ఆర్బీవీఆర్ఆర్) మానవతా విలువలు కలిగిన వ్యక్తి అని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కొనియాడారు. 50 ఏండ్ల కిందట హైదరాబాద్లో హాస్టల్ అంటే రెడ్డి హాస్టలేనని అన్నారు. రాజబహద్దూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో బర్కత్పురలో నూతనంగా నిర్మించనున్న రెడ్డి బాలికల వసతి గృహ నిర్మాణానికి శుక్రవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, గువ్వల బాలరాజుతో కలిసి స్పీకర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందు చూపుతో రాజబహద్దూర్ వెంకటరామిరెడ్డి రెడ్డి హాస్టల్ను నెలకొల్పారని చెప్పారు. హాస్టల్లో రుచికరమైన ఆహారం దొరికేదని, కొన్నేండ్ల కిందట తాను కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేసేవాడినని గుర్తు చేసుకొన్నారు. బాలికల హాస్టల్ భవన నిర్మాణానికి 1,260 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు వెంకటరామిరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, జితేందర్రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డితో పాటు సొసైటీ అధ్యక్షుడు కొండా లక్ష్మీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.