హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: రిటైర్మెంట్ డబ్బులు తమ వద్ద పెట్టుబడిగా పెడితే అధిక వడ్డీలు, లాభాలు ఇస్తామని నమ్మించి రూ.3.04 కోట్లు ముంచిన ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ (డీఎఫ్ఐ) సంస్థ నిర్వాహకుల్లో ప్రధాన సూత్రధారి కమలాకర్శర్మను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం పోలీసు బృందాలతో గాలిస్తున్నారు. 2004లో రిజిస్టర్ అయిన డీఎఫ్ఐ సంస్థ కమలాకర్శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఈ సంస్థలో పెట్టుబడిపెడితే అధిక వడ్డీలు ఇస్తామంటూ ఎక్కువ సంఖ్యలో బ్రాహ్మణ రిటైర్డ్ ఉద్యోగులను నమ్మించారు. ఇందుకు ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. బాధితుడైన న్యూ బోయగూడకు చెందిన నర్సింహమూర్తి 2011లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టడంతో 12 శాతం వడ్డీని 2019 వరకు సక్రమంగానే ఇస్తూ వచ్చారు.
ఆ తర్వాత డీఎఫ్ఐ నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్, ధరణి షెల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, డీఎఫ్ఐ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, డీఎఫ్ఐ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, డీఎఫ్ఐ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, డీఎఫ్ఐ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డీఎఫ్ఐ సృజన ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో వివిధ కంపెనీలను ప్రారంభించారు.
రియల్ ఎస్టేట్ సంస్థ ఫ్రీ లాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. ఇలా ఆయా సంస్థల్లో బాధితుడి నుంచి భారీ గానే పెట్టుబడులు పెట్టించి మోసాలకు పాల్పడ్డారు. బాధితుడితోపాటు 24 మంది ఆయా సంస్థల్లో రూ.3,04,55,500 పెట్టుబడులు పెట్టి మోసానికి గురయ్యారు. బాధితులంగా సీసీఎస్ పోలీసులకు గత ఏడాది ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఏసీపీ ఆదినారాయణ బృందం ఇటీవల ప్రధాన నిందితుడైన కమలాకర్ శర్మను అరెస్టు చేశారు. ఈ మోసంతో సంబంధమున్న మరికొంత మంది నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ధన్వంతరి ఫౌండేషన్ చైర్మన్ కమలాకర్శర్మ చేసిన మోసాలపై ప్రభుత్వం సీఐడీ విచారణ జరిపించాలని పలు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. బ్రాహ్మణ్ వెల్ఫేర్ భవన్ వ్యవస్థాపక సీఈవో గిరిప్రసాద్శర్మ, బ్రాహ్మణ సంఘాల నేతలు దర్శనం శర్మ, బసవరాజు, శ్రీనివాసులు కాచిగూడలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ర్టాలు, కర్ణాటకతోపాటు ఉత్తర భారతంలోని బ్రాహ్మణుల నుంచి కూడా భూముల కొనుగోలు ఇన్వెస్ట్మెంట్ పేరుతో కమలాకర్శర్మ రూ.350 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. ఇందులో నాలుగు వేల మంది బ్రాహ్మణులు పెట్టుబడులు పెట్టి మోసపోయారని వెల్లడించారు.