హైదరాబాద్, ఏప్రిల్ 18, (నమస్తే తెలంగాణ): మోదీ, అమిత్ షాల ఏలుబడిలో ప్రభుత్వ వ్యవస్థలు భ్రష్టుపట్టాయని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్రెడ్డి విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి దేశ ఆర్థిక వనరులు, మూలాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ సర్కార్పై రాజీలేని పోరాటం చేస్తున్న సీఎం కేసీఆర్కు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో మోదీ, షా ప్రజావ్యతిరేక పాలన నుంచి విముక్తి లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు, సంఘాలను ఏకతాటిపై తెచ్చిన కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీల పాత్ర పోషించగలరన్న విశ్వాసం తమకు ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ ప్రజలపై దండయాత్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులపై పెత్తనం సాగించడానికి కేంద్రం జారీ చేసిన గెజిట్లపై రాష్ట్ర బీజేపీ వైఖరి ఏమిటో ప్రజలకు చెప్పాలని సురేందర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
చేనేత జీరో జీఎస్టీకి దేవెగౌడ మద్దతు
చేనేతపై జీరో జీఎస్టీ ఉద్యమానికి మాజీ ప్రధాని దేవెగౌడ మద్దతు పలికారు. చేనేతపై జీఎస్టీని తొలగించాలంటూ ప్రధాని మోదీకి అఖిల భారత పద్మశాలి సంఘం రాసిన భారీ వస్త్ర లేఖపై ఆయన సోమవారం బెంగళూరులో సంతకం చేసి మద్దతు ప్రకటించారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో మొదలైన సంతకాల ఉద్యమానికి ఇప్పటికే టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎంపీల సంతకాలు తీసుకొన్నాక, సీఎంలు, ఆర్థిక మంత్రులు, పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డులందుకొన్న వారితోనూ సంతకాలు సేకరించాలని నిర్ణయించినట్టు సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత తెలిపారు. సంతకాల తర్వాత ఢిల్లీలో సభ ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. చేనేతపై జీఎస్టీని విధించడం వల్ల ఈ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేతపై జీఎస్టీని ఎత్తివేసే వరకు ఉద్యమిస్తామని పేర్కొన్నారు.