హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): నిరుపేద ప్రజల్లో రక్తహీనతకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రజా పంపిణీలో భాగంగా వినియోగదారులకు అందిస్తున్న సాధారణ రేషన్ బియ్యానికి బదులు పోషకాలు గల బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏప్రిల్ నుంచే రాష్ట్రవ్యాప్తంగా పంపిణీని ప్రారంభించనున్నది. గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఫోర్టిఫైడ్ సన్న బియ్యాన్నే సరఫరా చేయాలని నిర్ణయించింది. వీటిని అక్టోబర్ నుంచి సరఫరా చేయనున్నది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాలో ఏడాది కాలంగా ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఈ జిల్లాల్లోని గురుకులాలు, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీలకు కూడా ఈ బియ్యాన్నే పంపిణీ చేస్తున్నారు. ప్రజా పంపిణీలో భాగంగా ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీకి ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 31.20 కోట్లు ఖర్చు చేయనున్నది.
రక్తహీనతకు చెక్ పెట్టడంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, బీ-12 కీలకమైన పోషకాలు. సాధారణ బియ్యం పిండికి ఈ మూడింటితో చేసిన మిశ్రమాన్ని కలిపి మళ్లీ వాటిని బియ్యం గింజల మాదిరిగా తయారు చేస్తారు. వీటిని ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అంటారు. ఈ విధంగా తయారు చేసిన బియ్యం గింజలను సాధారణ బియ్యంలో కలిపేస్తారు. ప్రతి క్వింటాల్ సాధారణ బియ్యంలో ఒక కిలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ను కలుపుతారు. ఇవి సాధారణ బియ్యంలో కలిసిపోతాయి. ఈ విధంగా ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ కలిపిన బియ్యాన్నే బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) అంటారు. సాధారణ బియ్యం మాదిరిగానే ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కూడా ఉడుకుతాయి.
ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం, సరైన పోషకాలు గల ఆహారం లభించకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు, ముఖ్యంగా పేదలు రక్తహీనత బారినపడుతున్నారు. వారిని ఈ సమస్య నుంచి కాపాడేందుకు ప్రభుత్వం రేషన్లో సాధారణ బియ్యానికి బదులు బలవర్ధక బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం ప్రతిఏటా అదనంగా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నది.
-గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి