హైదరాబాద్, జనవరి 17 : ‘ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకొనే ప్రభుత్వాన్ని నేను ఇప్పటివరకు చూడనే లేదు. తన రాష్ట్రం పట్ల ఎంతో గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్. హైదరాబాద్ అన్ని విధాలా ఫార్ములా ఈ కి అనువైన వేదిక. అందుకే ఇక్కడ రేస్ నిర్వహణను మేం అధికారికంగా ప్రకటిస్తున్నాం’ అని ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ చాంపియన్షిప్ ఆఫీసర్ అల్బర్టో లాంగో చెప్పారు. సౌదీలో జనవరి 28, 29 తేదీల్లో ఏబీబీ ఎఫ్ఐఏ నిర్వహించే దిరియా ఈ-ప్రిక్స్ 2022కి హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన మంత్రి కేటీఆర్ను ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ ప్రకటన అనంతరం మీడియా ప్రశ్నలకు లాంగో సమాధానాలిచ్చారు.
హైదరాబాద్ను ఎంపిక చేయడానికి ముఖ్య కారణాలేమిటి?
మేం హైదరాబాద్లో అభివృద్ధిని చూశాం. అన్ని రకాల టెక్నాలజీలకు హైదరాబాద్ హబ్గా ఉన్నది. సుస్థిర కార్యకలాపాలకు కూడా హైదరాబాద్ హబ్గా ఉన్నది. స్వచ్ఛమైన విద్యుదుత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఇవన్నీ ఫార్ములా ఈ లక్ష్యాలకు సరిగ్గా సరిపోతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించింది?
భారీ మద్దతు లభించింది. 29 రోజుల క్రితం దిల్బాగ్ (మహింద్ర టీమ్) నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. ఫార్ములా ఈ నిర్వహణకు భారత్లో ఒక అవకాశమున్నదని తెలిపింది. కానీ.. ఇంత వేగంగా ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడాన్ని నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. ఈ నిర్ణయాల వెనుక ఉన్న నాయకులు, అధికారుల బృందం చొరవ వల్లనే.. ఇదంతా సాధ్యమైంది. ఒక మంత్రి (ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి) ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని నేను ఎక్కడా చూడలేదు. రాష్ట్రం కోసం ఆయన విజన్ ఏమిటో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ విషయం తెలిశాక నాకు ఆశ్చర్యమేసింది. ఫార్ములా ఈ క్యాలెండర్లో హైదరాబాద్ త్వరలోనే ఉంటుందని ఆశిస్తున్నాం. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ను కచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడి నాయకులు స్పందించిన తీరే మమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చింది.
ట్రాక్ ఎలా ఏర్పాటుచేస్తారు?
ట్రాక్ గురించి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన చాలా బాగున్నది. రేసుకు అనుకూలంగా మేము కొన్ని మార్పులు, చేర్పులను సూచించాం. తెలంగాణ ప్రభుత్వం రేసు కోసం ఎంపిక చేసిన ప్రాంతం అద్భుతంగా ఉన్నది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం.
రేసులో భాగస్వామ్యం గురించి చెప్పండి?
ఇది అంతర్జాతీయ ప్రదర్శన. చాలా దేశాలు ఇందులో పాల్గొంటాయని ఆశిస్తున్నాం. దాదాపు 400 నుంచి 500 మిలియన్ ప్రజలు ఈ రేస్ను టీవీ ద్వారా వీక్షిస్తారు. ప్రత్యక్షంగా 50 వేల నుంచి 80 వేల ప్రజలు ఈ రేస్ను చూస్తారని భావిస్తున్నాం.