Sarvey Sathyanarayana | మన్సూరాబాద్, ఏప్రిల్ 14: ‘రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తూతూమంత్రంగానే నడుస్తున్నది.. తుమ్మితే ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పరిస్థితి.. నడమంత్రపు సిరి వచ్చింది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు’ అని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 85 లక్షల మంది మాదిగలు ఉన్నారని, ఈ విషయాన్ని కొత్తగా అధికారంలోని వచ్చిన వారు విస్మరిస్తున్నారని తెలిపారు. ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో మాదిగలు ఓటు వేయరని జోస్యం చెప్పారు. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం ఎల్బీనగర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో సమర్థులైన నాయకులు, గెలుపు గుర్రాలు లేనట్టు వరంగల్ ఎంపీ టికెట్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి బిడ్డ కావ్యకు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు.
కడియం శ్రీహరి ఎవరూ మాదిగనా? మాలనా? లేక పోతే బ్యాక్వర్డ్ క్లాసా? అనేది ఇంకా తేలాల్సి ఉన్నదని, శ్రీహరి ఎస్సీ రిజర్వేషన్కు తగడని విమర్శించారు. ఆయన కుటుంబానికి ఎస్సీ రిజర్వేషన్ కింద కాంగ్రెస్ పార్టీ సీటు ఇవ్వకూడదని సూచించారు. ఆయనే ఒకానొక సందర్భంలో ‘నేను మాదిగను కాదు.. నాకు రిజర్వేషన్ వద్దు అన్నడు..’ మళ్లీ ఈ రోజు తన బిడ్డను ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిపాడని విమర్శించారు. కడియం బిడ్డ కావ్య హిందువే కాదు.. ఆమె వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని తెలిపారు. దీనిపై ఆధారాలు సేకరిస్తున్నారని ఆమెపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఈ సీటు ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ పునరాలోచించాలని సూచించారు. కావ్యకు ఇంకా కాంగ్రెస్ బీఫాం ఇవ్వనందున అభ్యర్థిని మార్చాలని కోరారు.
ఎట్టి పరిస్థితుల్లోను వరంగల్ సీటు మాదిగలకే ఇవ్వాలని, ఇస్తారన్న నమ్మకం ఇప్పటికీ తనకు ఉన్నదని చెప్పారు. మాదిగలకు సీటు ఇవ్వకపోతే మాదిగలు వారి కోపాన్ని చూపించి వరంగల్లో ఓడగొడతారని హెచ్చరించారు. ఇతర పార్టీ నుంచి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో సీటు ఇవ్వడం ఏమిటని సర్వే ప్రశ్నించారు. మరీ ముఖ్యంగా మాదిగలంతా ఒక్కటయ్యారని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయకపోతే మాదిగలు ఓటు వేయరని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు జోగు రాములు, ఆడాల రమేశ్, చామకూర రాజు, కేవీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.