హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి శ్వాసకోశ సంబంధిత సమస్యలు తీవ్రం కావడంతో బంజారాహిల్స్లోని స్టార్ దవాఖానలో చేరారు. అక్కడ వెంటిలేటర్పై అత్యవసర చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని బుధవారం సాయంత్రం 5 గంటలకు బంజారాహిల్స్లోని నివాసానికి తరలించారు. గురువారం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన మనువడు, ఎంపీ శ్రీభరత్ తెలిపారు.
కావూరి సాంబశివరావు.. మచిలీపట్నం, ఏలూరు నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ 2014లో కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2014 మే 1న బీజేపీలో చేరారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్నప్పటికీ, సిద్ధాంతాల కోసం పదవులను వదిలేశారు. ఆయన మృతిపై తెలంగాణ, ఏపీకి చెందిన వివిధ పార్టీల నేతలు, పారిశ్రామిక వేత్తలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.