హైదరాబాద్, జూలై 3, (నమస్తే తెలంగాణ) : గత ఎన్నికల ముందటి రాజకీయ ముఖచిత్రం మళ్లీ పునరావృతం అవుతున్నది. అయితే అప్పటికీ ఇప్పటికీ ఒకటే తేడా. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గూటికి చేరిన గాలివాటపు నేతలు, ప్రస్తుతం బీజేపీ పంచన చేరుతున్నారు. అయితే 2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో ఎక్కువ సీట్లు, ఓట్ల శాతాన్ని పెంచుకొని టీఆర్ఎస్ తనకు రాష్ట్రంలో ఎదురులేదని నిరూపించుకున్నది. అయినా కళ్లు తెరవని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి లాంటి గాలివాటు నాయకులు పార్టీలు మారడం ఆపలేదు. తాజాగా ఆయన బీజేపీ గూటికి చేరారు.
2019 ఎన్నికల ముందు ఈయన టీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అలాగే గత ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమిపాలైన వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ తదితర నాయకులు ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్లో చేరినా, బీజేపీలో చేరినా టీఆర్ఎస్ను ఇంచు కూడా కదిలించలేరని గత మూడేండ్లుగా వివిధ సందర్భాలలో జరిగిన పంచాయతీ, మున్సిపల్, పరిషత్తు ఎన్నికలలో విదితమైంది. గత ఎన్నికల సమయంలో రాహుల్గాంధీ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా బహిరంగసభకు హాజరైన గద్దర్.. ఆదివారం పరేడ్గ్రౌండ్లో జరిగిన బీజేపీ సభకు, అంతకుముందు తుక్కుగూడలో జరిగిన సభకు హాజరయ్యారు.
గత ఎన్నికలలో కాంగ్రెస్తో టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీలు మహాకూటమిగా జట్టుకట్టి టీఆర్ఎస్ను దెబ్బతీయాలనుకున్నాయి. కానీ వీటి అంచనాలను తలకిందులు చేస్తూ టీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా మారి మహాకూటమిని చిత్తుచిత్తుగా ఓడించింది. 2014 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు, ఓట్ల శాతాన్ని పెంచుకుని టీఆర్ఎస్ తనకు రాజకీయ ప్రత్యామ్నాయమే లేదని చాటిచెప్పింది. 2014 ఎన్నికలలో 63 సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ 2019 ఎన్నికలలో 88 సీట్లు గెలుచుకొని తన సత్తా చాటింది. కానీ మహాకూటమితో జట్టుకట్టిన పార్టీలు మాత్రం 2014 ఎన్నికలలో గెలిచిన సిట్టింగ్ సీట్లనూ నిలబెట్టుకోలేక చతికిలబడ్డాయి.
2014 ఎన్నికలలో 21 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ 19 సీట్లకు పరిమితమైంది. టీడీపీ కూడా 15 సీట్లనుంచి పడిపోయి 2 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. సీపీఐ, తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీలు పోటీ చేసిన అన్నిస్థానాల్లో డిపాజిట్లు కోల్పోయాయి. ఇక బీజేపీ ఒంటరిగానే పోటీ చేసినప్పటికీ.. అంతకుముందు గెలుచుకున్న 5 స్థానాలకుగాను చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా ఒక్క సీటుకే పరిమితంకాక తప్పలేదు.