ఖైరతాబాద్, ఏప్రిల్ 25: గొర్ల కాపరుల దాడిలో గాయపడి నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశర్ల సత్యనారాయణను గ్రీన్ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్కుమార్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. సత్యనారాయణపై గొడ్డలితో దాడి చేయడం బాధాకరమని వాపోయారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. పచ్చదనాన్ని పెంపొందించి, ప్రకృతిని కాపాడేందుకు గ్రీన్ఇండియా చాలెంజ్ లాంటి కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. తన చివరి శ్వాస వరకు అడవిని కాపాడుతూనే ఉంటానని స్పష్టంచేశారు. తనను పరామర్శించేందుకు వచ్చిన సంతోష్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. సంతోష్కుమార్ వెంట గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు రాఘవేందర్ యాదవ్, కిశోర్ గౌడ్, గర్రెపల్లి సతీశ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, సుర్వి యాదయ్య గౌడ్, సంపత్, ప్రముఖ కవి గాయకుడు జయరాజ్ తదితరులు ఉన్నారు.