ఖమ్మం, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను విమర్శించే అర్హత, స్థాయి లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ విమర్శించారు. మరోసారి వారిపై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. తన రాజకీయ స్వార్థం కోసమే బీఆర్ఎస్ను విమర్శిస్తున్న పొంగులేటి.. వాస్తవాలను మరుగున పెట్టి అబద్ధాలను మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఖమ్మంలోని తెలంగాణభవన్లో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రూ.300 కోట్ల నుంచి 3 వేల కోట్లకు ఎలా ఎదిగావని పొంగులేటిని ప్రశ్నించారు. 15 ఏండ్లయినా సీతారామ ప్రాజెక్టు పూర్తికాదంటున్న పొంగులేటి.. దాని నిర్మాణంలో 13వ ప్యాకేజీకి టెండర్ ఎలా వేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు.