హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన చట్టంలో లేకపోయినా బీబీనగర్ ఎయిమ్స్ (ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను బీఆర్ఎస్ సర్కార్ నాడు కొట్లాది సాధించిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంలో తాము తాత్సారం, నిర్లక్ష్యం చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్లో ఎంపీ బీబీపాటిల్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్ తదితరులతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు కేంద్రం నుంచి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రావాల్సిన వాటిపై సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధానిని కలవడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటిపై నాడు సీఎంగా కేసీఆర్ పదుల సంఖ్యలో ప్రధాని మోదీని కలిసి వందల లేఖలు రాసిన విషయాన్ని ఉదహరించారు. జాతీయ రహదారుల సాధన, రైల్వే లైన్ల సర్వే, కొత్త రైల్వేలైన్ల మంజూరు వంటి అనేక విషయాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని పట్టుబట్టిన అంశాలను ఆయన ఉదహరించారు.
తెలంగాణ ప్రయోజనాలపై రాజీలేని పోరు
తెలంగాణకు దక్కాల్సిన ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ సర్కారు రాజీలేని పోరాటం చేసిన విషయాన్ని విస్మరించవద్దని వినోద్కుమార్ కోరారు. సైనిక్స్కూల్ ఏర్పాటుకు స్థలమివ్వాలని కేంద్రం కోరితే వరంగల్లో భూసేకరణ చేశామని, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వం.. మొత్తం రాష్ట్రమే భరించాలని కేంద్రం మెలికపెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బయ్యారం ఉకు తెలంగాణ హకు అని నినాదం ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అనే విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని వాగ్దానం చేసి వ్యాగన్ రిపేర్ సెంటర్కు ప్రధాని పూనుకోవడాన్ని తాము ఆనాడే ఖండించామని చెప్పారు. హైదరాబాద్-సూర్యాపేట-విజయవాడ-చెన్నై వరకు బుల్లెట్ ట్రెయిన్ కోసం నాటి బీఆర్ఎస్ సర్కారు ప్రతిపాదనలు చేసిందని గుర్తుచేశారు. ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని బోయినపల్లి స్పష్టం చేశారు.