Bhadrachalam | భద్రాచలం, మార్చి 30: భద్రాద్రి రామాలయంలో శనివారం అపచారం చోటుచేసుకున్నది. మహబూబాబాద్ మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ భద్రాచలం పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు రంగా కిరణ్ తదితరులతో కలిసి ఆయన అంతరాలయం గర్భగుడిలోని సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఈ సమయంలో తీసిన ఫొటో నెట్టింట వైరల్గా మారింది. దీనిని చూసిన రామ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గర్భగుడిలో ఉన్న సీతారామచంద్రస్వామికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసే అధికారం ఎవరికీ లేదని, ప్రభుత్వం నుంచి గాని, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి గాని అనుమతులు మంజూరు చేసే హక్కు లేదని, కానీ.. ఆలయంలోని మూలవరులతో కూడిన ఫొటోలు పలు వాట్సాప్ గ్రూపులలో కనిపించాయని రామ భక్తులు కోపోద్రిక్తులయ్యారు.
ఆలయంలో ఫొటో తీసిన వ్యక్తిని గుర్తించి.. అతనిపై కేసు నమోదు చేయాలని రామ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. మాజీ ఎంపీ, బీజేపీ ప్రస్తుత ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్తోపాటు పలువురు సీతారామచంద్రస్వామివారి దర్శనానికి వచ్చి ఫొటోలు తీసినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఆలయంలోని మూలవరులను ఫొటోలు తీసిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి వివరించారు.