హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1500 కోట్ల వడ్ల కుంభకోణానికి పాల్పడిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆరోపించారు. వ్యాపారులతో కుమ్మక్కై 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను తక్కువ ధరకు విక్రయించారని క్వింటాకు రూ.700 చొప్పున నష్టం వచ్చిందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఇతర మంత్రులు ఇందులో పాత్రధారులుగా ఉన్నారని చెప్పారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ వెంటనే సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని, లేకుంటే తామే ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. తెలంగాణభవన్లో శనివారం విలేకరుల సమావేశంలో జీవన్రెడ్డి మాట్లాడారు. గోదాముల్లో నిలువ ఉన్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్లు పిలిచి క్వింటాలు రూ.1900 చొప్పున ప్రభుత్వం అమ్మిందని తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారంలో రూ.1450 కోట్ల మేరకు కుంభకోణం జరిగిందని చెప్పారు. గ్లోబల్ టెండర్లు పిలిచి 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను అతి తక్కువ ధరకు ఏపీకి, ఉత్తరాదికి చెందిన వ్యాపారులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో ప్రతి జిల్లా మంత్రికి పర్సంటేజీలు ముట్టాయని అన్నారు. వడ్ల కుంభకోణంపై బీజేపీ నేతలు బండి సంజయ్, రఘనందన్రావు, కిషన్రెడ్డి ఎందుకు మాట్లాడటంలేదని నిలదీశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ ఆర్ (రాహుల్-రేవంత్) ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నదని చెప్పారు. దేశంలోని మిగిలిన 26 రాష్ట్రాలకు తెలంగాణ నుంచి డబ్బులు ఎక్స్పోర్ట్ చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్రెడ్డికి ధాన్యం ధ్యాస లేదని, ధనం ధ్యాసే ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ హస్తం అవినీతి నేస్తమని అన్నారు. ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాదని, ఇది ఇండియన్ నేషనల్ కరప్షన్ పార్టీ అని అభివర్ణించారు. కాంగ్రెస్, అవినీతి రెండూ రాహువుకేతువులని, కవల పిల్లలని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలు బుట్టదాఖలయ్యాయని చెప్పారు. స్కీములు నిల్, స్కామ్లు ఫుల్ అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో వడ్లు దేశమంతా ఎగుమతి అయితే రేవంత్రెడ్డి హాయాంలో తెలంగాణ నుంచి నోట్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సీంల పాలన పోయి సాంల పాలన వచ్చిందని అన్నారు. ఢిల్లీకి కప్పం చెల్లించేందుకు రేవంత్ అక్రమ దందాలు చేయడంలో బిజీగా ఉన్నారని చెప్పారు.
అవినీతి చేసుకోవచ్చని మంత్రులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ హైకమాండ్కు డబ్బు సమకూరుస్తానని చెప్పినందుకే రేవంత్కు సీఎం పోస్టు వచ్చిందదని తెలిపారు. కాంగ్రెస్ మోసాలకు ఈ నాలుగు నెలల్లో ఎకువగా నష్టపోయింది రైతులేనని అన్నారు. రేవంత్రెడ్డి రైతుల పాలిట రాబందులా మారారని, రైతు భరోసా నుంచి పంటలకు బోనస్ వరకు రేవంత్వన్నీ బోగస్ మాటలేనని మండిపడ్డారు.
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగా పనిచేయకపోవడంతో రైతులు అడ్డికి పావుశేరులా ప్రైవేటు వారికి పంటను అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడే ముఖ్యమంత్రికి రైతుల గురించి మాట్లాడే తీరిక లేదని, ఢిల్లీకి ట్రిప్పులు కొట్టడం తప్ప రైతుల ధ్యాస లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరుద్యోగులను, ఉద్యోగులను, మహిళలను అందర్నీ మోసం చేసిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందేనని అన్నారు.
ఎంపీ రంజిత్ రెడ్డి, కడియం శ్రీహరి, కేశవరావుకు బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. రంజిత్రెడ్డి రంగారెడ్డి జిల్లాలో భూములను ఆక్రమించారని, అక్రమాలు చేశారని ఆరోపించారు. వీరు మళ్లీ పార్టీలోకి వస్తే తీసుకునే ప్రసక్తే లేదని, తానే తెలంగాణ భవన్ దగ్గర ఉండి రాకుండా అడ్డుకుంటానని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి కూడా పాల్గొన్నారు.