మహబూబ్నగర్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకి సకాలంలో రుణమాఫీ, రైతు బంధు, విత్తనాలు అదజేశాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా తప్పుడు హామీలను చూసి రైతులు మోసపోయారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) అన్నారు. షరతులు లేకుండా రైతుల రుణాలు మాఫీ(Loan waiver) చేయాలని తెలంగాణ కూడలిలో నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఇచ్చిన హామీలని మరిచిందన్నారు.
ఆగష్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద వోట్లు పెట్టి మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం రకరకాల ఆంక్షలు పెడుతూ కొంత మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసారని తెలిపారు. రుణమాఫీ కాలేదని.. రైతు బంధు రాలేదని.. కనీసం పిండి సంచులు కూడా అందటం లేదని ఏ గ్రామానికి వెళ్లిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బ్యాంకుల వద్ద రైతులు ఆందోళన చేస్తుంటే తిన్నది అరుగాక చేస్తున్నారని ప్రభుత్వంలో ఉన్న వారు మాట్లాడుతున్నారని అనడం వారి అహంకారానికి నిదర్శమన్నారు.
రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆందోళన చేస్తుంటే రాజకీయ దీక్షలు అంటున్నారు. పది ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెలంగాణ అభివృద్ధి చేస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణను వెన్నక్కి తీసుకుపోయే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారానికి పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజాస్వామ్య బద్ధంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.