మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 5: అబద్ధ్దాలు, దుష్ప్రచారంతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మంచిర్యాల, పెద్దపల్లిలో నిర్వహించిన ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయా సమావేశాలకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, దాసరి మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రెండు నెలల్లోనే కాంగ్రెస్ బండారం బయటపడిందని, ఇప్పుడు ప్రజలు తాము తప్పు చేశామన్న భావనలోకి వచ్చారని తెలిపారు. బీఆర్ఎస్కు మళ్లీ మంచిరోజులొస్తాయని చెప్పారు. హామీల అమలు చేతకాకపోతే తప్పుకోవాలని, సన్నాసులమని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ గురించి బుడ్డరఖాన్, సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చెప్పుతో కొట్టాలనిపిస్తున్నదని, కానీ తనకు సంస్కారం అడ్డు వస్తున్నదని బాల్క సుమన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పును ప్రదర్శిస్తూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో ఏ ఒక్క నాయకుడినీ పరుష పదజాలంతో దూషించలేదని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని చెప్పారు. ఉద్యమానికి వెన్నుపోటు పొడిచినా కాంగ్రెస్ నాయకులను క్షమించి వదిలేశామని చెప్పారు. రైతుబంధు కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన రూ.7,700 కోట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి, కాంగ్రెస్ కాంట్రాక్టర్లకి జేబుల్లోకి మళ్లించారని ఆరోపించారు.
మంచిర్యాల ఏసీసీ, ఫిబ్రవరి 5: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై సోమవారం మంచిర్యాల పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు 294బీ, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.