నాగర్కర్నూల్, ఏప్రిల్ 8 : కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి గుడిపల్లి వరకు సాగునీరందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. పదేండ్లు అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని వంద రోజుల్లోనే కాంగ్రెస్ భ్రష్ఠుపట్టించిందని విమర్శించారు. ఇగురం లేని పాలన చేసి రైతులకు నీరందకుండా చేశారని, పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అధ్యక్షతన కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించి మోసపోయామని ప్రజలు, రైతులు బాధపడుతున్నారని అన్నారు. నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. పంటలు ఎండిపోతున్నా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.