నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ), అక్టోబర్ 16: కాంగ్రెస్ను నిరంతరం ఓడించడమే కాకుండా.. శాసనమండలిని అధికార పార్టీలో విలీనం చేసిన ద్రోహి కూచుకుళ్ల దామోదర్రెడ్డి కుటుంబానికి పార్టీ టికెట్ కేటాయించడం దారుణమని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగం మాట్లాడుతూ.. కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన తనకు టికెట్ కేటాయించకపోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టికెట్ల కేటాయింపులో ఉదయపూర్ డిక్లరేషన్ను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. సర్వే పేరుతో తనకు నమ్మక ద్రోహం చేశారని, ఎక్కడ సర్వే చేశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల అభిప్రాయాల మేరకే తన వైఖరిని ప్రకటిస్తానని నాగం చెప్పారు.