హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. అంబటి రాంబాబు ఇంటిపై దాడి మరువకముందే తాజాగా ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. పెట్రోల్ బాంబులు, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇంటికి నిప్పుపెట్టారు. జోగి రమేశ్ నివాసంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ సమయంలో జోగి రమేశ్ తండ్రి, ఆయన సతీమణి, పిల్లలు ఇంట్లోనే ఉండటం గమనార్హం.
ఘటన సమయంలో జోగి రమేశ్ తిరుపతిలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నివాసంలో ఉన్నారు. తిరుపతిలో జోగి రమేశ్ స్పందిస్తూ తన కుటుంబం హత్యకు కుట్ర జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. దాడి విషయం తెలుసుకున్న మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆయన్ను ఫోన్లో పరామర్శించారు. దాడికి గురైన విడదల రజని, బ్రహ్మనాయుడిని సైతం జగన్ ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు.