Harish Rao | బీఆర్ఎస్ శ్రేణులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఫోన్ చేయాలని.. మీ వద్దకే వచ్చి భుజం కలిపి పోరాటం చేస్తానని మాజీ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. గజ్వేల్లో బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞతా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ ప్రజల కోసం నా తలుపులు 24 గంటల పాటు తెరిచే ఉంటాయన్నారు. పోరాటాలు మనకు కొత్త కాదని.. నేను అరెస్టు కానీ పోలీస్ స్టేషనే తెలంగాణలో లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్లో నన్నుపెట్టని పోలీస్ స్టేషన్ ఏదీ లేదని చెప్పారు. పోలీస్ స్టేషన్లు, ఉద్యమాలు పోరాటాలు కాదని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో అరెస్టయి.. మెదక్ జైల్లో నాలుగు రోజుల పాటు ఉన్నానన్నారు. ధైర్యంగా ఉండాలని.. బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు. గజ్వేల్లో కేసీఆర్ మంజూరు చేసిన పనులను ఆపడం ఇదెక్కడి పద్ధతని ప్రశ్నించారు.
చేతనైతే కేసీఆర్ చేసిన పనులకంటే ఎక్కువ చేయాలని.. ఎక్కువ అభివృద్ధి చేయాలని కాంగ్రెస్కు హితవు పలికారు. గజ్వేల్లో కేసీఆర్ మంజూరు చేసిన పనులు ఆపితే.. గజ్వేల్ ప్రజలు తిరగబడుతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఊళ్లల్లో నాట్లు తక్కువ పడుతున్నాయని.. నీళ్లు.. కరెంట్ ఇస్తరో లేదో అని అనుమానం పడుతున్నారన్నారు. పోయిన యాసంగితో పోల్చితే ఈసారి పంట సాగు తగ్గుతుందని.. ఆ వివరాలు ప్రజల ముందుపెట్టాలన్నారు. రైతుల్లో విశ్వాసం పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. సాగు నీరు, కరెంట్, రైతు బంధు అందించి సాగును పెంచాలన్నారు. కేసీఆర్ కోలుకుంటున్నారని.. త్వరలోనే గజ్వేల్ క్యాంప్ ఆఫీస్కు వస్తారన్నారు. మీ అందరితో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తారన్నారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో మీకు పూర్తిస్థాయిలో సహకారం ఉంటుందన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు మనకు అద్భుతమైన విజయం అందిస్తారన్నారు.
కర్నాటక ఇచ్చిన హామీలను అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో మూడువంతుల ఎంపీ సీట్లు అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని వార్తలు వస్తున్నాయన్నారు. ఎంపీ ఎన్నికల్లో కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఏడు ఎమ్మెల్యేల్లో ఆరు ఎమ్మెల్యేలు మన పార్టీ వాళ్లే ఉన్నారని.. అద్భుత విజయం సాధిస్తామన్నారు. నీళ్లు పల్లమెరుగు అంటే నీళ్లను మీదికి ఎక్కించి చూపించింది మన కేసీఆరేనన్నారు. ఎండాకాలంలో మత్తల్లు దూకేలా చేసింది.. మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్లో నిండా నీళ్లు నింపి పెట్టింది కేసీఆరేనన్నారు. ఆ నీళ్లను కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కాలువల్లో నీళ్లు విడుదల చేయాలని గజ్వేల్ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. స్థానిక నాయకులతో పాటు, కేసీఆర్, తాను అందుబాటులో ఉంటామని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. అందరం కలిసి ముందుకు వెళ్దామన్నారు.