Etela Rajender | కామారెడ్డి, ఏప్రిల్ 22: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ రాజకీయాలు చేస్తున్నాడని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ విమర్శించారు. ఉద్యమ నాయకుడిగా ఆయనపై ఎంతో గౌరవం ఉండేదని, కానీ ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. శనివారం ఆయన కామారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికలో పీసీసీ నేత రేవంత్రెడ్డి.. సీఎం కేసీఆర్ నుంచి రూ.25 కోట్లు తీసుకున్నాడని ఈటల ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కమ్యూనిస్టు భావాలు కలిగిన ఈటల, హిందుత్వమనే బీజేపీలో చేరి ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో పనులు చేయించుకున్నాడని, ఆయన గతమేమిటో తనకు తెలుసని చెప్పారు. తన వద్ద డబ్బు లేదని, దొడ్డు బియ్యం తింటానని చెప్పిన ఈటల.. నేడు వందల కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్న ఈటల.. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని రాలేదా? అని నిలదీశారు. ఇప్పుడు బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్గా ఉంటూ గలీజు రాజకీయాలు చేస్తున్నాడని షబ్బీర్ ధ్వజమెత్తారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఈటల తన మాటలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.