EX-DSP Nalini | హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): పోలీస్శాఖలోనే కాకుండా మరే ఇతర ఉద్యోగమూ చేయలేనని, ప్రస్తుత పరిస్థితుల్లో తన సమయాన్ని బ్యూరోక్రసీకి వెచ్చించలేనని తెలంగాణ ఉద్యమం కోసం డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన డీ నళిని ప్రకటించారు. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలనుకుంటే ఉద్యోగానికి బదులుగా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేయాలని కోరారు. ప్రభుత్వం నిధులు ఇస్తే వేద, యజ్ఞ, సంస్కృత సంబంధ ధార్మిక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల నళినికి మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆదివారం ఆమె సోషల్ మీడియా వేదికగా సీఎంకు బహిరంగ లేఖ రాశారు.
‘12 ఏండ్ల తర్వాత ఒక సీఎంగా మీరు నా కేసును మళ్లీ వెలికితీయడం చాలా సంతోషం. ఇన్నాళ్లకు నా పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భాన్ని సృష్టించారు. మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఉద్యమంలో నేను నిర్వహించిన కీలక పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది. కానీ, నా బంధు మిత్ర పరివారం మాత్రం నన్ను వెలివేసింది. ఏకాంతవాసం అనే శిక్షను పదేండ్లు అనుభవించా. పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయా. తీవ్ర ఇబ్బందులు ఎదురొన్న. జీవచ్ఛవంలా బతికా. నాకు మీరు న్యాయం చేయాలనుకుంటే ఉద్యోగానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ, సంస్కృత సంబంధ ధార్మిక కేంద్రం ఏర్పాటుకు వినియోగిస్తాను’ అని తెలిపారు. తాను సీఎంను కలవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలాలైన వేదం యజ్ఞం అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాసే పనిలో ఉన్నానని వెల్లడించారు.