హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ శుక్రవారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఆయనకు గాంధీ దవాఖానలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కొంపల్లిలోని జడ్జి ఎదుట హాజరుపర్చారు. ఈ మేరకు నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రి మాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. తర్వాత పోలీసులు ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు.
ఈ కేసులో కీలకంగా మారిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పంజాగుట్ట పోలీనులు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తమ కస్టడీలోకి తీసుకున్నారు. 5 రోజుల పోలీసు కస్టడీలో భాగంగా వారిని ఉస్మానియా దవాఖానలో వైద్య పరీక్షల అనంతరం కస్టడీలోకి తీసుకున్నారు. ముం దుగా రాధాకిషన్రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను ఎదురెదురుగా కూర్చోబెట్టి ఏకకాలంలో దాదాపు రెండుగంటలపాటు విచారించినట్టు సమాచారం. ఈ ముగ్గురికీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావుతో ఉన్న సంబంధాలు, ఫోన్ట్యాపింగ్ ద్వారా రాధాకిషన్రావు ఎవరెవరి సమాచారాన్ని తెలుసుకున్నాడో లాంటి కీలక అంశాలపై దర్యాప్తు అధికారులు విచారించినట్టు తెలిసింది. టాస్క్ఫోర్స్లో రాధాకిషన్రావుతో కలిసి పనిచేసిన ఇద్దరు సీఐలు, ఇద్దరుఎస్సైలు, కొందరు కానిస్టేబుళ్లను సైతం విచారించినట్టు సమాచారం.
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితులపై తాజాగా టెలిగ్రాఫ్ చట్టాన్ని సైతం జోడిస్తూ పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేసినట్టు సమాచారం. ఇప్పటివరకు సాక్ష్యాధారాలు ధ్వంసం, కుట్ర తదితర నేరాలపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు.. విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి రావడంతో ఈ చట్టాన్ని చేర్చినట్టు సమాచారం. టెలిగ్రాఫ్ చట్టం ప్రయోగించడం దేశంలో ఇదే తొలిసారి.