హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): నేరాల కేసుల ఛేదనలో పోలీసుల దర్యాప్తునకు ఫోరెన్సిక్ సైన్స్ ప్రధాన భూమిక పోషిస్తున్నదని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ తెలిపారు. బ్రూత్ ల్యాబ్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఫోరెన్సిక్ సైన్స్ వినియోగంపై నల్సార్ యూనివర్సిటీ శనివారం జాతీయ సదస్సును నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ.. క్రిమినల్ కేసుల్లోనే కాదు, సివిల్ కేసుల్లోనూ ఫోరెన్సిక్ సైన్స్ సేవలు కీలకంగా మారాయని వెల్లడించారు. కొత్త పుంతల పరిశోధనలను, సైన్స్ అండ్ టెక్నాలజీని ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉన్నదని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య తెలిపారు.
శాస్త్రీయ సాక్ష్యాన్ని రూపొందించటంలో ఫోరెన్సిక్ సైన్స్ పాత్ర కీలకమని వివరించారు. న్యాయవ్యవస్థ కేసుల్ని కొలికి తెచ్చేందుకు ఫోరెన్సిక్ సైన్స్ సహకారం ఎంతో ముఖ్యమని తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు వెల్లడించారు. క్రిమినల్ కేసులు, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో ఆధారాలను వెలికితీసేందుకు ఫోరెన్సిక్ సైన్స్ తోడ్పడుతుందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ వర్సిటీ చాన్స్లర్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉన్నదని రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హకుల కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్ మిశ్రా, జాతీయ లా కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఎం జగన్నాథరావు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీవీ రెడ్డి ప్రసంగించారు. డీజీపీ అంజనీకుమార్, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ టీ భవానీప్రసాద్, జస్టిస్ గోడ రఘురామ్, వర్సిటీ వైస్చాన్స్లర్ కృష్ణదేవరావు ఇతరులు పాల్గొన్నారు.