ఖలీల్వాడి, జనవరి 13: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీ చేయాలని నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) మాజీ చైర్మన్ చామకూర ప్రభాకర్రెడ్డి కోరారు. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న ఉద్యమ నాయకురాలు నిజామాబాద్ నుంచి పోటీ చేసి గెలిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిందని, ఆ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేయాలన్నది పార్టీ కార్యకర్తలుగా, ఉద్యమకారులుగా తమ కోరిక అని ఆయన పేర్కొన్నారు. 2014లో ఎంపీగా ఎన్నికైన కవిత.. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు, కేంద్రీయ విద్యాలయాలు, మెడికల్ కళాశాల వంటి వాటి కోసం పార్లమెంట్లో గళం విప్పారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు సుజిత్సింగ్ ఠాకూర్, ఎనుగందుల మురళి, కరిపె రాజు, సత్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.