హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లోని ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆర్టిజన్ కార్మికుల జేఏసీ ఏర్పాటయ్యింది. ఆదివారం మింట్ కాంపౌండ్లోని విద్యుత్తు గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మికులంతా కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. జేఏసీ చైర్మన్గా పప్పు వెంకటేశ్వర్లు, కన్వీనర్ ధరావత్ సికిందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. 23 వేల మంది కార్మికుల కన్వర్షన్, ఐదేండ్లు పూర్తిచేసుకున్న వారికి ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేసి ప్రమోషన్లు, పర్సనల్ పే బేసిక్ పేతో కలిపి పీఆర్సీ ప్రకటించాలని కోరారు. మిగిలిన 6,500 కార్మికులతోపాటు ఎన్పీడీసీఎల్లో పనిచేస్తున్న ఆన్మ్యాన్ గ్యాంగ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, ఖాళీగా ఉన్న 9 వేల ఆర్టిజన్ పోస్టులను భర్తీచేయాలని విజ్ఞప్తిచేశారు.