భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ)/ చండ్రుగొండ/ ఖమ్మం: విధి నిర్వహణలో ఉన్న చండ్రుగొండ అటవీశాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావును గొత్తికోయలు(వలస ఆదివాసీలు) కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి హత్యచేశారు. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పంచాయతీ ఎర్రుబోరు ప్లాంటేషన్ వద్ద మంగళవారం చోటుచేసుకొన్నది.
ఫారెస్టు అధికారులు, పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం.. బెండాలపాడు గ్రామ శివారు అడవిలో ఉన్న ప్లాంటేషన్లో పది మందికి పైగా గొత్తికోయలు ఆవులు, మేకలు మేపుతున్నారు. ఇది గమనించిన ఫారెస్టు వాచర్ భూక్యా రాములు, సెక్షన్ ఆఫీసర్ రామారావు ప్లాంటేషన్లో ఆవులను మేప కూడదని, మొక్కలు చనిపోతాయని గొత్తికోయలకు చెప్పారు. అయితే గొత్తికోయలు వారి మాట వినకుండా వాదనకు దిగారు. దీంతో వాచర్ రాములు చండ్రుగొండలో ఉన్న చలమల శ్రీనివాసరావుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆయన వెంటనే ప్లాంటేషన్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో సెక్షన్ ఆఫీసర్ రామారావు పశువులను బయటకు వెళ్లగొడుతుండగా.. ఇద్దరు వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. ఆ వెంటనే పక్కనే ఉన్న రేంజర్ శ్రీనివాసరావుపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా మెడ, ఛాతి భాగాల్లో నరికేశారు.
రామారావు అందించిన సమాచారం మేరకు ఎఫ్డీవో అప్పయ్య వెంటనే అక్కడకు చేరుకొని తన వాహనంలో శ్రీనివాసరావును చండ్రుగొండ దవాఖానకు, అక్కడ నుంచి ఖమ్మం దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ హత్య తరువాత గొత్తికోయలు మొత్తంగా ఊరు ఖాళీ చేసి వెళ్లినట్టు స్థానికులు పేర్కొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గొత్తికోయల గ్రామంలోకి ఇతరులను పోలీసులు అనుమతించడం లేదు. మృతుడికి భార్య భాగ్యలక్ష్మి, 9వ తరగతి చదువుతున్న కుమారుడు యశ్వంత్, 6వ తరగతి చదువుతున్న కుమార్తె కృతిక ఉన్నారు.
మంచిపేరు తెచ్చుకున్న శ్రీనివాసరావు
రేంజర్గా శ్రీనివాసరావు కొద్దిరోజులకే మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అడవుల సంరక్షణ, అడవిలోని జంతువుల కోసం గడ్డిజాతి మొక్కల పెంపంకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన చేసిన కృషికి ప్రభుత్వం గత సంవత్సరం రాష్ట్రస్థాయిలో గోల్డ్మెడల్ బహూకరించింది. జిల్లాలో కలెక్టర్ చేతుల మీదుగా రూ.10 వేల నగదు పారితోషికం అందుకున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి శిక్షణ తరగతిలో అధికారులు శ్రీనివాసరావు చేత పలు అంశాలపై శిక్షణ ఇప్పించేవారు. శ్రీనివాసరావుది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం. గతంలో సెక్షన్ అధికారిగా, డీఆర్వోగా పనిచేసిన ఆయన నాలుగేండ్ల క్రితం రేంజర్గా పదోన్నతిపై చండ్రుగొండకు వచ్చారు. సత్తుపల్లి, ములుగు, లింగాల, ప్రాంతాల్లో పనిచేశారు. ములుగు జిల్లాలో పని చేసినప్పుడు నక్సలైట్లతో కొంత వైరుధ్యం ఉండేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఇంటెలిజెన్స్ అధికారుల సూచన మేరకు ఉన్నతాధికారులు ఆయనను చండ్రుగొండకు బదిలీ చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రేంజర్ హత్య జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రుల సంతాపం
ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి పట్ల మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, వీ శ్రీనివాస్గౌడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సంతాపం వ్యక్తంచేశారు.
ఐఎఫ్ఎస్ అసోసియేషన్ ఖండన
శ్రీనివాసరావును గుత్తికోయలు హత్య చేయడాన్ని ఐఎఫ్ఎస్ అసోసియేషన్ తెలంగాణ విభాగం తీవ్రంగా ఖండించింది. శ్రీనివాసరావు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అసోసియేషన్, ఫీల్డ్ ఆఫీసర్ల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. విధి నిర్వహణలో ప్రతిభకుగాను 2021లో శ్రీనివాసరావు కేవీఎస్ బాబు రాష్ట్ర బంగారు పతకాన్ని అందుకున్నారంటూ అసోసియేషన్ ఆయన సేవలను గుర్తుచేసుకొన్నది. తెలంగాణ అటవీ అధికారుల సంఘం, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ రెవిన్యూ అధికారుల సంఘం, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలతో పాటు టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్ తదితరులు శ్రీనివాసరావుపై దాడిని ఖండిస్తూ ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.
పథకం ప్రకారమే..?
చండ్రుగొండ రేంజర్ శ్రీనివాసరావును పథకం ప్రకారమే హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్లాంటేషన్లో పశువుల మేత మేపే వ్యక్తుల దగ్గర కత్తులు, గొడ్డళ్లు ఎలా ఉంటాయి? రేంజర్ను అతి కిరాతకంగా నరికి చంపి, పక్కనే ఉన్న సెక్షన్ అధికారి, వాచర్, ఇతర సిబ్బందిని విడిచి పెట్టడం ఇలాంటి అనుమానాలకు బలాన్నిస్తున్నది. ఘటనా స్థలాన్ని కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరరావు సందర్శించి ఆయుధాలు, అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కొత్తగూడెం ఎస్పీ డాక్టర్ వినీత్ చండ్రుగొండ పోలీస్స్టేషన్కు వచ్చి, హత్య కేసును విచారిస్తున్నారు.