హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): దాదాపు ఏడాదిన్నర క్రితం మాయమైపోయిన రాబందుల ఉనికి తెలంగాణలో మళ్లీ కనిపిస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెద్దవాగు, ప్రాణహిత నది సంగమ ప్రాంతంలో 200 మీటర్ల ఎత్తులో ఉన్న పాలరాపుగుట్టలో వీటి ఆనవాళ్లను గుర్తించినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. కొన్ని వారాలుగా పెంచికల్పేట ప్రాంతంలో భారతీయ లాంగ్-బిల్డ్ రాబందులు కనిపిస్తున్నాయని, పాలరాపుగుట్ట చుట్టూ రెండు నుంచి మూడు జంటలు తిరుగుతున్నాయని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా డీఎఫ్వో శాంతారామ్, బెజ్జూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎం రామ్మోహన్ పేర్కొన్నారు. గతంలో పాలరాపుగట్టల్లో నివాసం ఉన్న రాబందులు ఏటా ఎనిమిది నుంచి పది పిల్లలకు జన్మనిచ్చేవి. 2019 ఆగస్టులో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, గుట్ట కోతకు గురికావడంతో రాబందులు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లాయి. దీంతో రాష్ట్రంలో ఇవి అంతరించిపోయాయని అటవీశాఖ అధికారులు భావించారు. కొద్దిరోజులుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల నుంచి రాబందులు పాలరాపుగట్టకు రావడం శుభ పరిణామమని డీఎఫ్వో ఎస్ శాంతారామ్ పేర్కొన్నారు. రాబందుల సంతానోత్పత్తి కాలం అక్టోబర్లో ప్రారంభమై మే చివరి వరకు కొనసాగుతుంది. అక్టోబర్ లేదా నవంబర్లో పాలరాపుకొండపై గుడ్లు పెట్టి పొదుగుతాయి. రాబందులు ఏడాదికి ఒక గుడ్డు మాత్రమే పెడుతాయని, వాటి పిల్లలను రక్షించడం చాలా ముఖ్యమని రాబందుల పరిరక్షణపై పరిశోధనా పత్రాలను ప్రచురించిన రవికాంత్ పేర్కొన్నారు. గూడు కట్టడం, గుడ్లు పెట్టడం, గుడ్లు పొదగడం, పిల్లల ఎదుగుదల వంటి కార్యకలాపాలను ‘బర్డ్ ట్రాకర్ల’ ద్వారా గమనిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్న వాచ్ టవర్ నుంచి 24 గంటలు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని బెజ్జూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి రామ్మోహన్ చెప్పారు.