బూర్గంపహాడ్, జూన్ 20: పోడు సాగుచేసుకుంటున్న మహిళా రైతులపై అటవీ అధికారులు, సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం ఇరవెండి బీట్ పరిధిలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కోసుగుంపు గ్రామంలోని పోడు సాగుదారులకు చెందిన భూముల్లోకి అటవీ అధికారులు జేసీబీలతో వెళ్లి కందకాలు తీయిస్తుండగా గిరిజన మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తమను దారుణంగా కొట్టారని, ఓ మహిళ దుస్తులు చినిగిపోయినట్టు తెలిపారు. అక్కడే ఉన్న కొందరు మహిళలు ఈ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా అధికారులు నాగరాజు, రాంబాబు, సిబ్బంది బాబురావు, రమేశ్ ఫోన్లు లాక్కొని వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. 25 ఏండ్లుగా ఇక్కడే జీవనం సాగిస్తూ పోడు చేసుకుంటున్నామని, తమకు ఆధార్, రేషన్, ఓటరు కార్డులు ఉన్నాయని తెలిపారు. దాడి చేసిన అధికారులపై బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీనిపై అశ్వాపురం రేంజర్ రమేశ్ను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.