DGP Anjani Kumar | నేర పరిశోధన మరింత వేగవంతంగా జరిపేందుకు ఫోరెన్సిక్ సైన్స్ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. నేరపరిశోధనలో ఫోరెన్సిక్ సైన్స్ను టూల్గా ఉపయోగించేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓల నుంచి సీపీల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని డీజీపీ కార్యాలయం నుంచి నిర్వహించారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ డైరెక్టర్, అడిషనల్ డీజీ షికా గోయల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ నేర పరిశోధనలలో సరికొత్త సవాళ్లయిన సైబర్ క్రైమ్ పరిశోధనలోనూ ఈ ఫోరెన్సిక్ సైన్స్ కీలక పాత్ర వహిస్తుందని అన్నారు. దాంతో పాటు పోస్కో కేసుల పరిశోధనలోనూ దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు ముఖ్యంగా పోలీసశాఖ బలోపేతానికి, ఆధునిక యంత్ర సామగ్రికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందన్నారు. దీంట్లో భాగంగానే బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ టవర్ను ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు.
ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతల పరిస్థితి నియంత్రణలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, దీనికి నిదర్శనం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ఉదాహరణ అని పేర్కొన్నారు. పౌరుల ఆత్మ గౌరవానికి పోలీస్ అధికారులు విలువనివ్వాలని, ఇందుకు తమ పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతీ ఒక్కరికి మర్యాదతో మాట్లాడాలన్నారు. ఎంత టెక్నాలజీ, ఆధునిక సౌకర్యాలున్నా ఒక వ్యక్తి ఆత్మ గౌరవానికి విలువ ఇవ్వకపోతే అన్నీ నిష్ప్రయోజనమన్నారు. పోలీస్ శాఖలో ఉన్న దాదాపు 80వేల మంది పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు కూడా తాము ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వెళ్లే ఇతర నగరాలు, రాష్ట్రాలు దేశాల్లోనూ పోలీసుల నుంచి ఇదేవిధమైన డిగ్నిటీని కోరుకుంటారని స్పష్టం చేశారు.
కస్టోడియల్ వాయిలెన్స్, మరణాలపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్ర పోలీస్శాఖలో మరో మూడు, నాలుగు నెలల్లో అత్యధిక సంఖ్యలో మహిళా పోలీస్ అధికారులు నియామకం కానున్నారని, ప్రస్తుత ఆధునిక భావాలు, టెక్నాలజీ సవాల్గా ఉంటుందని, వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడంతో పాటు, ఇంటి పెద్దగా శిక్షణ నివ్వాలని డీజీపీ సూచించారు. తెలంగాణా ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి దేశంలోనే మరే రాష్ట్రంలో లేనంతటి ఆధునిక పరికరాలున్నాయని వెల్లడించారు. ఫోరెన్సిక్ లాబ్లో జనవరి 2022లో 7,186 పరిశోధనా కేసులుండగా, 2023 ఏప్రిల్ నాటికి 2,093కు పరిమితమయ్యాయని, కేసుల పరిశోధనలో వేగవంతం చేయడంపై ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ సైంటిస్టులు, అధికారులను అభినందించారు.
తెలంగాణా ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ డైరెక్టర్, అడిషనల్ డీజీ శిఖా గోయల్ మాట్లాడుతూ పోస్కో కేసుల పరిశోధనలో వారంరోజుల్లోనే నివేదికలను ఇచ్చే ఫోరెన్సిక్ ల్యాబ్గా.. తెలంగాణ ల్యాబ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. ఇక నుంచి ప్రతీ సోమావారాన్ని ప్రాపర్టీ రిటర్న్ డేగా పరిగణిస్తున్నట్టు ప్రకటించారు. నార్కోటిక్స్, మాదక ద్రవ్యాల గుర్తింపులో అత్యంత ఆధునిక ఎక్విప్మెంట్ను సమకూర్చుకున్నామని, ఇది కేవలం 30 నిమిషాల్లోనే సింథటిక్ లాంటి డ్రగ్స్ను గుర్తిస్తుందని తెలిపారు. ఫేక్ వీడియోలను కూడా గుర్తించడంలో ఎఫ్ఎస్ఎల్ కీలక పాత్ర వహిస్తోందని అన్నారు. నేర పరిశోధన త్వరితగతిన చేపట్టేందుకు ఫోరెన్సిక్ సైన్స్ను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఎల్కు చెందిన సైంటిస్టులు కే అంజన, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.