జడ్చర్ల : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Government ) ఇచ్చిన హామీలు ఎక్కడా కూడా అమలు కావడం లేదని బీఆర్ఎస్ నాయకుడు , మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ( Laxma Reddy ) అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం అంబేద్కర్ కళా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడి సగం రోజులు గడిచిపోయాయని, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, ఇంకెన్ని రోజులు ప్రజలను మభ్య పెడుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ అత్యంత అవినీతిమయమైందని, మంత్రులు మధ్య వాటా పంచాయితీ ఎప్పుడూ చూడలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజల సంక్షేమం,అభివృద్ధిపై పట్టింపు ఉండదని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మూడున్నర లక్షల కోట్లు అప్పు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రెండు లక్షల ఎనబై వేల కోట్లు మాత్రమే అప్పు చేసిందని కేంద్రం పార్లమెంట్లో చెప్పిందని గుర్తు చేశారు. మూడేండ్లు పూర్తి కాక ముందే మూడున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేశారని ప్రభుత్వాన్ని లక్ష్మారెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్ చేసిన అప్పులు కడుతున్నామని అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు.
మూడున్నర లక్షల కోట్ల అప్పుతో మీరు చేసిన పనులు కనిపించడం లేదు. ప్రాజెక్టులు లేవు. సంక్షేమం లేదు. హామీల అమలు లేదని అన్నారు. రైతు భరోసా నిధులు మూడుసార్లు ఎగ్గొట్టి మోసం చేశారని ఆరోపించారు. బడ్జెట్ లో అంకెల గారడీతో అభివృద్ధి సాధ్యం కాదని, పేపర్ లో మాత్రమే అంకెలను అటు ఇటు మార్చి చెప్పినంత మాత్రాన క్షేత్రస్థాయిలో ఫలితాలు రావని పేర్కొన్నారు.